Tuesday, 11 June 2013

చంద్రబాబువన్నీ అసత్యాలే: దాడి

6/11/2013 4:22:00 AM
- జైలులో నిబంధనలు కచ్చితంగా అమలుచేస్తున్నారు
- యనమలతో బాబే లేఖలు రాయిస్తున్నారని విమర్శ

సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసత్యాలు చెబుతూ తన విశ్వసనీయతను తానే తుంచేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. జగ న్‌పై కోపం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలే కానీ అసత్య ప్రచారంతో కాదని హితవు పలికారు. సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద దాడి మీడియాతో మాట్లాడారు. నూకారపు సూర్యప్రకాశ్ జైలులో ఉన్నపుడు చంద్రబాబు చెబితే తాను అక్కడికి వెళ్లానని, అక్కడ అంతా నిబంధనల ప్రకారమే జరగడాన్ని స్పష్టంగా చూశానని చెప్పారు. డిప్యూటీ జైలర్ గదిలో గాలి జనార్దన్‌రెడ్డిని ఆయన న్యాయవాదులు కలుసుకున్నారని, అలాగే సినీనటుడు నాగార్జున వచ్చి నిమ్మగడ్డ ప్రసాద్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించారు. తాను జగన్‌ను కూడా జైలర్ గదిలోనే కలుసుకున్నానని, ములాఖత్‌లు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎందరు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నా ముగ్గురికి వారానికి రెండుసార్లు మాత్రమే లభిస్తున్నాయని వివరించారు. ఇది తెలిసి కూడా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లేఖలు పంపుతున్నారని దుయ్యబట్టారు. యనమల చేత చంద్రబాబే లేఖలు రాయిస్తున్నారని దాడి విమర్శించారు. జైలులో సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు వాడుతున్నారనే ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం ద్వారా విశ్వసనీయతను పెంచుకునేందుకు చంద్రబాబు ఏ రోజూ ప్రయత్నించరని, ఎదుటి వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తారని దాడి విమర్శించారు. జైలు అధికారులు చాలా కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారని అన్నారు. చంద్రబాబు చేస్తున్నదంతా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని వ్యాఖ్యానించారు. ‘‘అసలు జగన్‌ను జైల్లో కూడా ఉండనివ్వరా? ఆయన్ను ఏం చేయదల్చుకున్నారు? ’’ అని ప్రశ్నించారు. సీబీఐ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్‌గా పనిచేస్తోంటే రాష్ర్టంలో మాత్రం చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. శాసనమండలి సమావేశాలను శాసనసభతో పాటుగా జరుపకపోవడం కించపర్చడమేనని దాడి వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment